ఆక్వా దాణా ధర పెంపుపై చర్చలు విఫలం
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:21 AM
రొయ్యల దాణా ధరల పెంపుపై దాణా తయారీ కంపెనీలు, రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారం విజయవాడలోని మత్స్యశాఖ కార్యాలయంలో..
ఏకాభిప్రాయానికి రండి.. లేకుంటే ధరల కమిటీ వేస్తాం: మంత్రి అచ్చెన్న
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా ధరల పెంపుపై దాణా తయారీ కంపెనీలు, రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారం విజయవాడలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రొసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, రైతుల ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అప్సడా కో వైస్ చైర్మన్ రమణారెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఫిష్మీల్, సోయాబిన్ తదితర ముడి పదార్థాల ధరలు పెరిగి, ఉత్పత్తి వ్యయం అధికమైనందున కిలోకి రూ.12 చొప్పున పెంపుదల తప్పదని దాణా తయారీ కంపెనీల ప్రతినిధులు తెగేసి చెప్పారు. అయితే కిలోకి రూ.6 చొప్పున పెంచాలని, అదీ ఒక నెలకే పరిమితం చేయాల ని రైతు ప్రతినిధులు కోరారు. ఇందుకు కంపెనీలు ఒప్పుకోకపోవడంతో ఇరువురూ పరస్పర అంగీకారంతో ముం దుకు రావాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 12వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు ఈనెల నుంచి యూనిట్ విద్యుత్కు రూ.1.50 చొప్పున రాయితీ ఇస్తామని, అన్ని ఆక్వా ఫారాలకు ఇది వర్తిస్తుందని మంత్రి తెలిపారు.