తపాలాశాఖతో వ్యవసాయశాఖ ఒప్పందం
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:12 AM
నాణ్యత, నియంత్రణ కింద సేకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నమూనాలను సురక్షితంగా, సమయానికి రవాణా చేసేలా తపాలాశాఖతో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకుంది.
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నాణ్యత, నియంత్రణ కింద సేకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నమూనాలను సురక్షితంగా, సమయానికి రవాణా చేసేలా తపాలాశాఖతో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకుంది. గురువారం మంగళగిరిలోని వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ మనజీర్ జిలానీ, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శివరామ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జిలానీ మాట్లాడుతూ వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి నుంచి, ప్రాంతీయ కోడింగ్ కేంద్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు నమూనాలను సురక్షితంగా సకాలంలో రవాణా చేయాల్సి ఉందని, ఇందుకోసం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. 2026-27లో 15వేల విత్తన నమూనాలు, 20వేల ఎరువుల నమూనాలు, 11వేల పురుగు మందు నమూనాలకు తపాలా శాఖతో కలిపి, డిజిటల్ ట్రాకింగ్, నిరంతర పర్యవేక్షణతో ప్రామాణిక రవాణా విధానం అమలు చేయనున్నట్లు వివరించారు.