రేపటి నుంచి ఏఈఈ నియామక పరీక్షలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:26 AM
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) నియామకం కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు.
ట్రాన్స్కో జేఎండీ ప్రవీణ్ చంద్ వెల్లడి
అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) నియామకం కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ట్రాన్స్కో, జెన్కో, మూడు డిస్కంల పరిధిలో సివిల్, మెకానికల్, టెలికాం/ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా.. 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టామని ప్రవీణ్ చంద్ వివరించారు. ఫలితాలను, మెరిట్ జాబితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు (ఒరిజినల్) తీసుకువెళ్లాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సూచించారు. చివరి పరీక్ష జరిగిన తేదీ నుంచి మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేస్తామని, ఏడు రోజులు ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 1ః1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారన్నారు. ఉద్యోగాలు కోసం అభ్యర్థులెవరూ దళారుల మాటలు నమ్మవద్దని, డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.