గడువులోగా సోలరైజేషన్ ప్లాంట్లు
ABN , Publish Date - May 21 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో 1,162 మెగావాట్ల సామర్థ్యంతో 228 ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. పీఎం కుసుమ్ పథకంలో సాగుతున్న ఈ పనులను ...
1162 మెగావాట్ల సామర్థ్యంతో 228 ఫీడర్ లెవెల్ ప్రాజెక్టులు
పనుల పురోగతిని సమీక్షించిన విజయానంద్
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1,162 మెగావాట్ల సామర్థ్యంతో 228 ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. పీఎం కుసుమ్ పథకంలో సాగుతున్న ఈ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశంచారు. వెలగపూడి సచివాలయం నుంచి డిస్కంల సీఎండీలు లోతేటి శివశంకర్, పృధ్వీతేజ్ ఇమ్మడి, పి.పుల్లారెడ్డి, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్బాబుతోపాటు రాష్ట్రంలోని డిస్కంల ఎస్ఈలు, ప్రాజెక్టు డెవలపర్స్తో ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం విజయానంద్ ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం-కుసుమ్ పథకం తీసుకొచ్చిందని, దాని కింద ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎ్సపీడీసీఎల్, కుప్పం రెస్కో పరిధిలో అమలువుతున్న ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పురోగతిని సమావేశంలో సమీక్షించారు. భూసేకరణ, సివిల్ పను లు, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విడుదలకు అవసరమైన అర్హతల పురోగతిపై చర్చించారు. వ్యవసాయ రంగానికి పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే కీలక పునరుత్పాదకత ఇంధన కార్యక్రమం పీఎం కుసుమ్ అని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పీఎం-కుసుమ్ కాంపోనెంట్ కింద 1,162.80 మెగావాట్ల సామర్ధ్యంతో 228 ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్లాంట్లు అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు సివిల్ పనులు, మెటీరీయల్ మొబలైజేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల అమలుపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని, పెండింగ్ ఉన్నవాటిని వేగంగా పరిష్కరించాలని, డిస్కంలు, డెవలపర్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు.