పవన్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:53 AM
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేసే ఒంటరి పోరాటం చూసి... ఒక్కడు ఇంకెంతకాలం పోరాటం చేయగలడు..? అనిపించిందని ఆయన సతీమణి అన్నా లెజినోవా అన్నారు.
2024 విజయానికి ముందు ఎన్నో ఓటములు చవిచూశారు
పిల్లల కోసం ధైర్యంగా నిలబడ్డా.. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది
ఇన్స్టాలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా భావోద్వేగ పోస్ట్
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేసే ఒంటరి పోరాటం చూసి... ఒక్కడు ఇంకెంతకాలం పోరాటం చేయగలడు..? అనిపించిందని ఆయన సతీమణి అన్నా లెజినోవా అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై ఆమె ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో కూడిన సుదీర్ఘ పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు.. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు ఆయన ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదన్నారు. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించిందన్నా రు. అంతకుముందు పవన్ ఎన్నో ఓటములు చవిచూశారని.. విజయం, ఫొటోలు, చిరునవ్వులు, సంబరాలు, వార్తలు ఇవే అందరికీ కనిపిస్తాయని అన్నారు. కానీ, వాటి వెనక ఏళ్ల తరబడి సాగిన పోరాటం, అలసట, అవమానాలు, అనిశ్చితిని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజు లు ఎన్నో ఉన్నాయన్నారు. చాలామంది ఆయన్ను అవమానించారని, ఎగతాళి చేశారని, ప్రశ్నించారని, రకరకాల పేర్లతో దూషించారని గుర్తుచేశారు. పవన్ బయట రాజకీయ పోరాటాలు చేస్తుంటే.. తాను ఇంట్లో పిల్లల కోసం ధైర్యంగా నిలబడేందుకు ప్రయత్నించానని చెప్పారు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేదని.. తెలిపారు. పవన్ విజయం కేవలం రాజకీయ విజయం కా దని.. మానవతా విజయమని అన్నారు. కళ్లలో నీళ్లతో అక్కడ నిలబడటం తనకు ఇంకా గుర్తుందన్నారు. ప్రధాని మోదీ కూడా తాను కన్నీటి పర్యంతం కావడం గమనించారన్నారు.