ఇక ఆకాశమార్గాన ఔషధాలు!
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:45 AM
ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఆర్డర్ చేసిన మందులు ఆకాశ మార్గాన వేగంగా ఇంటికి డెలివరీ అయితే ఎంతో బాగుంటుంది కదా! అలాంటి సేవలు త్వరలో రాజధాని ప్రాంతంలో అందనున్నాయి.
రాజధాని ప్రాంతంలో డ్రోన్లతో తేలికపాటి సరుకుల రవాణా
అమరావతి, విజయవాడ, గుంటూరులో 10 వేల డ్రోన్లతో సేవలు
దీని కోసం ప్రత్యేకంగా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ఏర్పాటు
ఎయిర్బౌండ్తో రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందం
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఆర్డర్ చేసిన మందులు ఆకాశ మార్గాన వేగంగా ఇంటికి డెలివరీ అయితే ఎంతో బాగుంటుంది కదా! అలాంటి సేవలు త్వరలో రాజధాని ప్రాంతంలో అందనున్నాయి. డ్రోన్ల సాయంతో అమరావతి, విజయవాడ, గుంటూరు మధ్య తేలికపాటి హెల్త్కేర్, కమర్షియల్ సరుకులు రవాణా చేసేందుకు వీలుగా బెంగళూరుకు చెందిన ఏరో స్పేస్ కంపెనీ ఎయిర్బౌండ్తో రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ గురువారం ఒప్పందం చేసుకుంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు సమక్షంలో డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ, ఎయిర్బౌండ్ వ్యవస్థాపకుడు, సీఈవో నమన్ పుష్ప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రోజుకు 10,000 డ్రోన్ల ద్వారా అమరావతి ప్రాంతంలో హెల్త్ కేర్, తేలికపాటి వాణిజ్య సరుకులను డెలివరీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ డ్రోన్లు ముందుగా గుంటూరు ప్రాంతంలో సేవలు అందిస్తాయని పుష్ప్ వెల్లడించారు.