‘ఎఫ్ఆర్సీ’ ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:55 AM
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్థానంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ(ఎఫ్ఆర్సీ) ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది.
మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్థానంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ(ఎఫ్ఆర్సీ) ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గురువారం దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును మంత్రివర్గ సమావేశంలో పెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ఫైలు ఆమోదం కోసం రానుంది. దీనిని మంత్రివర్గం ఆమోదించిన వెంటనే గవర్నర్కు పంపించి.. ఆయన ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. దీంతో ఉన్నత విద్య కమిషన్ స్థానంలో ‘ఫీజు రెగ్యులేటర్ కమిటీ’ ఏర్పాటవుతుంది. రానున్న మూడేళ్ల కాలానికి ఈ కమిటీనే ఫీజులు సిఫారసు చేస్తుంది. అలాగే ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటులో కొంత వెసులుబాటు కల్పించేందుకు వీలుగా.. ప్రైవేటు వర్సిటీల చట్టంలో సవరణలు ప్రతిపాదించే ఫైలు కూడా మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. విశ్వవిద్యాలయాల విస్తీర్ణం, అనుమతుల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తారు. అలాగే ప్రైవేటు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుపైనా ఉన్నత విద్యాశాఖ నిబంధనలు రూపొందిస్తోంది. ప్రత్యేకంగా మహిళా వర్సిటీ అంటే ఎలాంటి నిబంధనలు ఉండాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.