డీటీసీపీ విద్యుల్లత నియామకం నిలిపివేత
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:26 AM
ఏపీ రెరా ట్రైబ్యునల్ టెక్నికల్ మెంబర్గా డీటీసీపీ విద్యుల్లత నియామకం తాత్కాలికంగా నిలిచిపోయింది.
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఏపీ రెరా ట్రైబ్యునల్ టెక్నికల్ మెంబర్గా డీటీసీపీ విద్యుల్లత నియామకం తాత్కాలికంగా నిలిచిపోయింది. ‘పక్కా ప్రణాళికలతో అందలం’ అనే శీర్షికన విద్యుల్లత నియామకంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వార్తపై స్పందించి ఆ నియామకాన్ని వెంటనే నిలిపేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. టీడీఆర్ బాండ్ల జారీ స్కాం, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలకు అండగా నిలబడి వైజాగ్లో టీడీపీ ఏపీ అఽధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భవనాలను అక్రమంగా కూల్చివేయించడం తదితర అంశాలపై ఆమెపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఆమెపై విచారణ జరిపిన విజిలెన్స్... డీటీసీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఆమె పావులు కదిపి ఏకంగా ఏపీ రెరా ట్రైబ్యునల్ టెక్నికల్ సభ్యులుగా నియామకానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బట్టబయలు చేయడంతో ఆమె నియామకం నిలిచిపోయింది.