మిగిలిన వాటితో పోల్చితే.. గుడ్డు ధర తక్కువే!
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:47 AM
దేశంలో అధికంగా కోడిగుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు తెలిపారు.
‘గుడ్డు.. గుభేల్’పై పశుసంవర్ధకశాఖ స్పందన
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో అధికంగా కోడిగుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు తెలిపారు. 18.37 శాతం గుడ్లు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘గుడ్డు.. గుభేల్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించారు. ‘ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా గుడ్ల ఉత్పత్తి కొంత తగ్గడం, ఇటీవల ప్రభుత్వం ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా గుడ్ల వినియోగం పెరగడం తదితర కారణాల వల్ల డిమాండ్ పెరిగింది. మాంసకృత్తులను అందించే ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే, కోడిగుడ్ల ధర పెరుగుదల నామమాత్రమే. ఇది తాత్కాలికమే. దీని వల్ల పౌల్ర్టీ పరిశ్రమ తిరిగి అభివృద్ధి బాటలో నడవటమే కాకుండా వేల మంది జీవనోపాధికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది’ అని వివరించారు.