తుంగభద్ర కేటాయింపులు కుదించేందుకు వీల్లేదు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:51 AM
తుంగభద్ర లోలెవల్ ..హైలెవల్ కెనాల్ కేటాయింపులు కుదించేందుకు వీల్లేదని.. ఆ అధికారం బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్కు లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది.
తెలంగాణ వాదన అసంబద్ధం.. బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ స్పష్టీకరణ
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర లోలెవల్ ..హైలెవల్ కెనాల్ కేటాయింపులు కుదించేందుకు వీల్లేదని.. ఆ అధికారం బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్కు లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ఈ అంశంలో కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-1 ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. తుంగభద్ర జలాలపై శాస్త్రీయ అధ్యయనం పేరిట తెలంగాణ చేస్తున్న వాదన అసంబద్ధంగా ఉందని.. అది వితండవాదమని పేర్కొంది. గురువారం బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా, న్యాయవాది జి.ఉమాపతి వాదనలు వినిపించారు. తుంగభద్ర నది జలాలకు సబంధించి హైలెవల్, లోలెవల్ కెనాల్స్కు ట్రైబ్యునల్-1 కేటాయించిన జలాలన్నీ ఆంధ్రప్రదేశ్కు అవసరమని.. రాష్ట్ర విభజన చట్టంలోనూ దాని కేటాయింపులను నిర్ధారించారని గుర్తుచేశారు. ఈ కేటాయింపులను మార్చే అధికారం బ్రిజేశ్ ట్రైబ్యునల్కు లేదన్నారు.