పట్టణాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రాయితీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:32 AM
రాష్ట్రంలోని పట్టణాల్లో నిర్మాణ కార్యకలాపాలకు ఊతమివ్వడం, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నిర్మాణాలు ప్రారంభించాక 50శాతం చెల్లిస్తే చాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు
నిర్మాణ కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్కు ప్రోత్సాహం లక్ష్యం
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాల్లో నిర్మాణ కార్యకలాపాలకు ఊతమివ్వడం, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై విధించే వీఎల్టీ(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)పై నిర్మాణ కాలంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. చట్టబద్ధంగా భవన నిర్మాణ అనుమతి పొందిన స్థలాల యజమానులకు ఈ రాయితీ వర్తిస్తుంది. నిర్మాణం కొనసాగుతున్నంత కాలం ఖాళీ భూముల పన్నులో 50 శాతం మాత్రమే వారు చెల్లించాల్సి ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ, నిర్మాణం పూర్తయినట్లు ధ్రువీకరణ, అనుమతి గడువు ముగింపు, పొడిగించిన గడువు ముగింపు దాకా ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ఈ రాయితీని పూర్తిగా డిజిటల్ విధానంలో అమలు చేస్తారు. అయితే, అనధికార నిర్మాణాలు, చట్టబద్ధ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఈ రాయితీ వర్తించదు.