Share News

ఏపీకి మరో కేంద్రమంత్రి పదవి!

ABN , Publish Date - Jun 28 , 2026 | 06:40 AM

కేంద్ర మంత్రివర్గం లో ఆంధ్రప్రదేశ్‌కు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి ప్రస్తుతం ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులకు తోడు త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో..

ఏపీకి మరో కేంద్రమంత్రి పదవి!

  • మోదీ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో అవకాశం

  • టీడీపీ నుంచి మరొకరికి బెర్తు కల్పించే యోచన

న్యూఢిల్లీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గం లో ఆంధ్రప్రదేశ్‌కు మరింత ప్రాధాన్యం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి ప్రస్తుతం ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులకు తోడు త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరొకరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన మరో ఎంపీకి మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని అంటున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా బీజేపీకి చెందిన మరో ఎంపీకి క్యాబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరితోపాటు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే, జనతాదళ్‌(యు) అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌, తృణమూల్‌ నుంచి తిరుగుబాటు చేసిన సుఖేందు శేఖర్‌రాయ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌కు మళ్లీ అవకాశం కల్పిస్తారని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నిర్వహిస్తున్న సమాచార, ప్రసారశాఖను అప్పగిస్తారని అంటున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మారుస్తారని, ఆమె స్థానంలో ఆర్థికవేత్తను నియమించే యోచనలో మోదీ ఉన్నారని తెలుస్తోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌, హర్దీప్ సింగ్‌ పురి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో పాటు పలువురు మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖట్టర్‌కు గవర్నర్‌ పదవి అప్పగించవచ్చని అంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.


బీఎల్‌ సంతోష్‌ తొలగింపు..!

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఆర్‌ఎస్ఎస్‌ మరో ప్రచారక్‌ను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల బీజేపీకి, సంఘ్‌కు జరిగిన సమావేశాలు కూడా సంతోష్‌ లేకుండానే జరిగాయి. తెలంగాణలో బండి సంజయ్‌, తమిళనాడులో అన్నామలై వంటి నేతలను ప్రోత్సహించిన సంతోష్‌ ఎందరో నాయకులను తయారు చేశారు. కేసీఆర్‌ హయాంలో ఎమ్మెల్యేలతో బేరసారాల కేసుకు సంబంధించి సంతోష్‌ పేరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2019 నుంచి బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంతోష్‌.. ఇటీవల పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలోని ఉడుపికి చెందిన సంతోష్‌ను మళ్లీ సంఘ్‌ సేవలకు పిలిపిస్తారనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 28 , 2026 | 06:41 AM