‘ఏకీకృత పెన్షన్’ మార్గదర్శకాలు ఇవే!
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:27 AM
జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) ఆధారంగా అఖిల భారత సర్వీసు అధికారులకు, సీసీఎస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకం అమలుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం...
అఖిల భారత సర్వీసు, సీసీఎస్ అధికారులకే వర్తింపు
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) ఆధారంగా అఖిల భారత సర్వీసు అధికారులకు, సీసీఎస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకం అమలుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఈ పథకం ఒక నిర్దిష్టమైన కంట్రిబ్యూషన్ ద్వారా స్థిరమైన పదవీ విరమణ ఆదాయాన్ని అందించడం, పదవీ విరమణ తర్వాత క్రమబద్ధమైన చెల్లింపులకు ఆప్షన్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు, ఉద్యోగుల డేటా నిర్వహణ, నిధుల బదిలీ వ్యవహారాల బాధ్యతలకు నోడల్ అధికారిగా మంగళగిరి పే అండ్అకౌంట్స్ అధికారిని నియమించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు తమ యూపీఎస్ ఆప్షన్ను డీడీవోకు తెలియజేయాలి. వారు ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను(ప్రాన్) పొందవచ్చు. యూపీఎస్ సజావుగా అమలయ్యేలా చూసేందుకు, కంట్రిబ్యూషన్ల సేకరణ, నిధుల బదిలీ, రికార్డుల నిర్వహణ కోసం క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానాల కోసం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.
సీపీఎస్ ఉద్యోగులకు వర్తించదు
యూపీఎస్ పథకం సీపీఎస్ ఉద్యోగులకు వర్తించదని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీశ్ తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు వర్తిస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తక్షణమే సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, ప్రభుత్వం తమతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.