ఎల్ఆర్ఎస్, బీపీఎస్ నిధుల పంపిణీకి మార్గదర్శకాలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:27 AM
పట్టణాల్లో మౌలిక సదుపాయాల లోటును తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగం
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో మౌలిక సదుపాయాల లోటును తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్-2020, బీపీఎస్-2025 కింద వసూలైన నిధుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు జారీచేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ చేశారు. రాష్ట్రంలో అమృత్ 2.0 కింద నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, చెరువుల పునరుద్ధరణకు భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, వరద కాల్వలు, పర్యావరణ మౌలిక వసతుల రంగాల్లో ఇంకా లోటు ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ నిధులను మౌలిక పనులకు వినియోగించేందుకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించింది. ఎల్ఆర్ఎస్ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో యూడీఏ 30 శాతం, గ్రామ పంచాయతీలు 50 శాతం, డీటీసీపీకు 20 శాతం పంపిణీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో యూడీఏలకు 10 శాతం, పట్టణ స్థానిక సంస్థలకు 25 శాతం, డీటీసీపీలకు 65 శాతం కేటాయించనున్నారు. బీపీఎస్ నిధులు గ్రామీణ ప్రాంతాలకు యూడీఏ 15 శాతం, గ్రామ పంచాయతీ 70 శాతం, డీటీసీపీ 15 శాతం పంపిణీ చేస్తారు. పట్టణ స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులు ఆయా పరిధుల్లోనే వినియోగించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.