Share News

ఈ-స్టాంప్‌ కేసు పురోగతిపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:50 AM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ-స్టాంప్‌ అక్రమాలపై నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదికలను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఈ-స్టాంప్‌ కేసు పురోగతిపై నివేదిక ఇవ్వండి

  • పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి: సీఐడీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ-స్టాంప్‌ అక్రమాలపై నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదికలను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ-స్టాంప్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనంతపురం వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... తక్కువ విలువ చేసే ఈ-స్టాంపులను కొనుగోలు చేసి ఎక్కువ విలువగల స్టాంపులుగా మార్చి ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ రూ.వందల కోట్ల లావాదేవీలు నిర్వహించిందన్నారు. ఈ మోసం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే సూత్రధారిగా ఉన్నారన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని తాము పిల్‌ వేసిన తర్వాతి రోజే కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూకేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆరా తీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... ఈ స్టాంపుల అక్రమాలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామన్నారు. రికార్డులన్నింటినీ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 14వేల లావాదేవీలు జరగ్గా.. అందులో 36 అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చాక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 04:51 AM