బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిపై హైకోర్టుకు
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:22 AM
ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా పి.నాగ మానసను నియమిస్తూ మహిళ శిశు సంక్షేమశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బి. పద్మావతి హైకోర్టులో...
నాగమానసను సభ్యురాలిగా నియమించడంపై పిటిషన్
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా పి.నాగ మానసను నియమిస్తూ మహిళ శిశు సంక్షేమశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బి. పద్మావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మానస నియామకానికి సంబంధించి జారీ చేసిన జీవో 11ను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. అన్ని అర్హతలు ఉన్న తనను నియమించేలా మహిళ శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్ను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నాగ మానస ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మహిళ శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, కమిషన్ సభ్యురాలు నాగ మానసకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 18కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు.