High Court: ఆ ముగ్గురు మావోయిస్టులను పెనమలూరు పీఎస్లో విచారించవచ్చు
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:51 AM
మావోయుస్టులు యు.రఘు, ఓయం జ్యోతి, మడకం దివకర్లను 16, 17 తేదీల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో విచారించేందుకు పోలీసులకు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది.
పోలీసులకు హైకోర్టు వెసులుబాటు
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మావోయుస్టులు యు.రఘు, ఓయం జ్యోతి, మడకం దివకర్లను 16, 17 తేదీల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో విచారించేందుకు పోలీసులకు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. వీరిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారణ చేయాలని విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. నిందితుల భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత గన్నవరం డీఎస్పీదేనని స్పష్టం చేసింది. నిందితుల తరఫు న్యాయవాదులు కోరితే... వారికి కనిపించేంత దూరంలో విచారణ చేయాలని, ప్రక్రియ మొత్తం ఆడియో, వీడియో రికార్డు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివరాలను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని గన్నవరం డీఎస్పీని ఆదేశించింది. ఇంట్రాగేషన్ వివరాలను సీల్డ్ కవర్లో విజయవాడ కోర్టుకు అందజేయాలని, ఓ కాపీ హైకోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ పిటిషన్పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.