పెరుగుతున్న ఎండలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
కర్నూలు, నందిగామలో 37 డిగ్రీలు.. బలపడనున్న అల్పపీడనం
అమరావతి, విశాఖపట్నం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా కర్నూలు, నందిగామల్లో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట చలి ప్రభావం కొనసాగుతోంది. కాగా శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ప్రవేశించింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.