డీవైఈవోల ఎంపిక ప్రక్రియపై హైకోర్టు స్టే
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:27 AM
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డివైఈవో) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డివైఈవో) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రక్రియను నిలిపివేసినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ నెల 24న జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆగిపోయాయి. కాగా మహిళా కోటాపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై హైకోర్టు రెండు వారాల స్టేటస్ కో విధించింది. కాగా, టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల తుది ఎంపిక ప్రక్రియకు ఏపీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. ఈనెల 23న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి, ఏడు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.