రాష్ట్రంలో జనవరిలో జీఎస్టీ వసూలు 3,073 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:08 AM
రాష్ట్రంలో జనవరిలో రూ.3,073 కోట్ల నికర జీఎస్టీ వసూలైందని ప్రభుత్వం ప్రకటించింది. నిరుటి జనవరితో పోలిస్తే 6.72 శాతం పెరిగినట్లు ఆదివారం ఓ ప్రకటనలో...
నూతన సంవత్సరం, సంక్రాంతి జోష్తోనే
గత ఏడాది కంటే 6.72శాతం పెరుగుదల
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనవరిలో రూ.3,073 కోట్ల నికర జీఎస్టీ వసూలైందని ప్రభుత్వం ప్రకటించింది. నిరుటి జనవరితో పోలిస్తే 6.72 శాతం పెరిగినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జనవరి నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారని పేర్కొంది. నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల కారణంగా పన్ను వసూళ్లు పెరిగాయి. జాతీయ స్థాయిలో జీఎస్టీ వృద్ధిరేటు 5.8 శాతం ఉండగా, ఏపీలో అంతకంటే మెరుగైన ప్రదర్శన కనిపించిందని పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎ.బాబు ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జీఎస్టీ రూ.1,284 కోట్లు నమోదు కాగా.. గత ఏడాది కంటే 8.37 శాతం ఎక్కువన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం ద్వారా రూ.1,490 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.38 కోట్లు వసూళ్లయ్యాయని.. ఐజీఎస్టీ నిధులు రూ.1,789 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్లలో ఉన్న అడ్డంకులను తొలగించడం, తప్పుడు క్లెయిమ్లను గుర్తించడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు.