Share News

గాడిలోకి డిస్కంలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:00 AM

వైసీపీ హయాంలో కుదేలైన విద్యుత్తు పంపిణీ సంస్థలు కూటమి ప్రభుత్వ హయాంలో గాడిన పడుతూ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.

గాడిలోకి డిస్కంలు

  • మెరుగైన పనితీరుతో సీ నుంచి బీ గ్రేడ్‌లోకి

  • విద్యుత్తు పంపిణీ నష్టాలు 7.9 శాతానికి తగ్గుదల

  • దేశవ్యాప్తంగా డిస్కంల పనితీరుపై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నివేదిక

  • వైసీపీ హయాంలో బలహీన పనితీరు కనబర్చిన డిస్కంలు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో కుదేలైన విద్యుత్తు పంపిణీ సంస్థలు కూటమి ప్రభుత్వ హయాంలో గాడిన పడుతూ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల పని తీరును మదింపు చేసిన కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌పసీ) 14వ వార్షిక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సంస్థలు సీ గ్రేడ్‌ నుంచి బీ గ్రేడ్‌కు అప్‌ గ్రేడ్‌ అయ్యాయి. గత ఏడాది ఏ గ్రేడ్‌ సాధించిన ఈపీడీసీఎల్‌ మాత్రం బీకి జారింది. డిస్కంల ఆర్థిక స్థిరత్వం, ఆపరేషనల్‌ సామర్థ్యం, పాలనవంటి అంశాల ఆధారంగా గ్రేడింగ్‌లను ఇస్తారు. ఏపీ డిస్కంలు నష్టాలు, వసూళ్లలో జాప్యం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా తక్కువ పనితీరును కనబర్చి బీ గ్రేడ్‌లో నిలిచాయి. వైసీపీ హయాంలో డిస్కంల పనితీరు ఘోరంగా పడిపోయింది. ఐదేళ్లలో ఎక్కువసార్లు సీ గ్రేడ్‌కే పరిమితమయ్యాయి. పీఎ్‌ఫసీ నివేదిక ప్రకారం గతేడాది డిస్కంలు మెరుగైన పనితీరు కనబర్చాయి. బిల్లుల వసూళ్ల సామర్థ్యం 94.91 శాతం నుంచి 99.26 శాతానికి పెరిగింది. విద్యుత్తు పంపిణీ నష్టాలను 12నుంచి 7.9 శాతానికి తగ్గించుకోగలిగాయి. దీంతో మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల సరసకు ఏపీ చేరుకోగలిగింది.

Updated Date - Jan 25 , 2026 | 05:00 AM