Share News

పౌష్టికాహార పంపిణీలో ఏపీకి ఏ-ప్లస్‌ గ్రేడ్‌

ABN , Publish Date - May 09 , 2026 | 05:06 AM

గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఏ-ప్లస్‌ గ్రేడ్‌లో నిలిచిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సూర్యకుమారి తెలిపారు.

పౌష్టికాహార పంపిణీలో ఏపీకి ఏ-ప్లస్‌ గ్రేడ్‌

  • కలెక్టర్ల సదస్సులో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రజంటేషన్‌

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఏ-ప్లస్‌ గ్రేడ్‌లో నిలిచిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సూర్యకుమారి తెలిపారు. గర్భిణులు, బాలింతలకు 96.22 శాతం, పిల్లలకు 97.29 శాతం పంపిణీ చేసి లక్ష్యాన్ని చేరుకున్న ట్టు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ల సదస్సులో మహిళలు, చిన్నారుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. సూర్యకుమారి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహారం ఇచ్చే కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన మౌలిక సదుపాయాల పనుల గురించి వివరించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించడానికి వెంటనే స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో మంజూరైన 192 కేంద్రాల్లో 156 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 641 అంగన్వాడీ వర్కర్లు, 131 మినీ వర్కర్లు, 5,325 హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ విధించామన్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం వంద శాతం సక్సెస్‌ అయిందని, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098 లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించినట్టు తెలిపారు.

Updated Date - May 09 , 2026 | 05:07 AM