సోషల్ మీడియా వినియోగంలో చిన్నారులపై ఆంక్షలు!
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:38 AM
చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు.
16 ఏళ్లలోపు వారిని దూరంగా ఉంచడంపై అధ్యయనం చేస్తున్నాం
సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే నిర్ణయం
బ్లూమ్బర్గ్ ఇంటర్వ్యూలో లోకేశ్ వెల్లడి
పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఏపీ
దేశవ్యాప్తంగా వచ్చినవాటిలో ఏపీకి 25శాతం రావడమే నిదర్శనం
18 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు: మంత్రి
ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన బ్లూమ్బర్గ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో గత ఏడాది డిసెంబరు నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విఽధించారని, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ విధానం అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని లోకేశ్ తెలిపారు. సోషల్ మీడియాపై ఆంక్షలు లేకపోవడం వల్ల.. దాని ద్వారా రకరకాల కంటెంట్ అందుబాటులోకి వస్తోందని, దానిని అర్థం చేసుకునే పరిణతి చిన్నారుల్లో ఉండదని, ఒక్కోసారి దాని వల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియా ఫ్లాట్ఫారాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని, దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడమే దీనికి నిదర్శనమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని.. గత 18 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.