‘పీఎం సేతు’లో ఏపీ ఫస్ట్
ABN , Publish Date - May 31 , 2026 | 05:11 AM
దేశంలోని ఐటీఐలకు మహర్దశ పట్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం సేతు పథకానికి రాష్ట్రం ఎంపికైంది.
ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా నవీకరించేందుకు 60 వేల కోట్లతో స్కీమ్
ఈ పథకానికి ఎంపికైన తొలి రాష్ట్రం మనదే
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఐటీఐలకు మహర్దశ పట్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం సేతు పథకానికి రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం కింద విశాఖలోని ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా చేసిన ప్రతిపాదనను జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదించింది. అవసరమైన నిధులను కేంద్రం పీఎం సేతు పథకం కింద అందిస్తుంది. దేశంలోని దాదాపు వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించేందుకు రూ.60,000 కోట్లతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని తొలిసారిగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ నిలవడం గమనార్హం. ఐటీఐ విద్యార్థులకు అవసరమైన సాంకేతిక బోధనా సదుపాయాలను కల్పిస్తారు. వారిలో సాంకేతిక నైపుణ్యాభివృద్ధిని పెంచేలా స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంటారు. సామాజిక బాధ్యత కింద స్థానికంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణకు, సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు అప్రెంటిస్షిప్ను పరిశ్రమలు ఇస్తాయి. సాంకేతికాంశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన నిధుల సమీకరణకు స్థానిక పరిశ్రమలు సహకారం అందిస్తాయి.