Share News

పరిశ్రమలకు భూ కేటాయింపులు

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:58 AM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పలు పారిశ్రామిక సంస్థలకు రాయితీలతో కూడిన భూముల అప్పగింతతో పాటు పెట్టుబడి రాయితీలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.

పరిశ్రమలకు భూ కేటాయింపులు

  • ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పన

  • పతంజలి సంస్థకు విజయనగరంలో 70 ఎకరాలు

  • రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పలు పారిశ్రామిక సంస్థలకు రాయితీలతో కూడిన భూముల అప్పగింతతో పాటు పెట్టుబడి రాయితీలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడులో జీరో 21 రెన్యువబుల్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మూడు చక్రాల ఆటో, రెట్రో ఫిట్‌మెంట్‌ కిట్ల తయారీ యూనిట్‌ను రూ.525 కోట్లతో స్థాపించనుంది. 625 మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. ఈ సంస్థకు 48.14 ఎకరాలను ఎకరా రూ.30 లక్షల చొప్పున అప్పగించడంతో పాటు 40 మెగావాట్ల (50,000 కేవీఏ) నిరంతరాయ విద్యుత్తు, 10 లక్షల లీటర్ల నీటి సరఫరా, 80 అడుగుల అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సదుపాయాలన్నీ 6 నెలల్లో కల్పించాలని ఏపీఐఐసీని ఆదేశించింది.

  • చిత్తూరు జిల్లా శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో రూ.1,123.49 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించే అవెరాన్‌ ప్యానెల్స్‌ లిమిటెడ్‌కు మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డులు తయారు చేసేందుకు 106 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం 132/66 కేవీఏ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఇంధన శాఖను ఆదేశించింది. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ నుంచి నీటిని సరఫరా చేయాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.


  • జీడీ నెల్లూరు ఇండిస్ట్రియల్‌ పార్కులో ప్లాట్‌ నం. 19, 20, 21లలోని 1.57 ఎకరాలను విక్రయించేందుకు, లీజులకు ఇచ్చేందుకు పుత్తా శ్రీ లెదర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు స్వేచ్ఛను ఇస్తూ నిరభ్యంతర పత్రాన్ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ సంస్థలో రూ.12.96 కోట్ల పెట్టుబడివల్ల 49 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.

  • తిరుపతిలో స్థాపించిన మున్నోత్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు ప్రస్తుతం కేటాయించిన 7.19 ఎకరాలకు అదనంగా 15.28 ఎకరాలను కేటాయిం చనుంది. లూథియం బ్యాటరీలను తయారీకి రూ.730 కోట్లతో పరిశ్రమ స్థాపించింది.

  • మీడియం, లార్జ్‌ క్యాలిబర్‌ అమ్యూనిషన్‌, వార్‌హెడ్స్‌ అండ్‌ ఫ్యూజెస్‌ వంటి రక్షణ పరికరాలు తయారు చేసే అనడ్రోన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పాపంపల్లెలో 349.95 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

  • రక్షణ శాఖ కోసం మిసైల్‌ అసెంబ్లింగ్‌, ఇంటిగ్రేషన్‌, లోయిటరింగ్‌ మ్యూనిషన్‌ తయారీ యూనిట్‌ స్థాపనకు అనంత్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా దుత్తలూరులో 300 ఎకరాలు కేటాయించింది.


  • అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో సాలిడ్‌ ప్రొపల్లెంట్‌(రాకెట్‌ ఇంధనం) ప్రాసెసింగ్‌ ఫెసిలిటీని స్థాపించేందుకు స్పేస్‌ఫీల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 120.76 ఎకరాలను కేటాయించింది.

  • ఎన్‌టీఆర్‌ జిల్లా జగ్గయ్య పేట మండలం, జయంతిపురంలో ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ ఎక్స్‌ప్లోజివ్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఐకామ్‌ టెలీ లిమిటెడ్‌కు 300 ఎకరాలు కేటాయించింది.

  • తిరుపలి జిల్లా నాయుడుపేటలో అఫర్డబుల్‌ రెంటల్‌ హౌసింగ్‌ ప్రాజెక్టును స్థాపించేందుకు ప్రతిపాదనలు ఇచ్చిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెమ్‌కు రోడ్లు, విద్యుత్తు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ 750 సింగిల్‌, 250 డబుల్‌ బెడ్‌ రూమ్‌లతో పాటు 1,400 బెడ్‌లతో కూడిన 150 గదులు నిర్మిస్తుంది. వీటిలో 5,750 మంది నివాసానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

  • విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నరావుపల్లెలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు 70 ఎకరాలను ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించింది.

  • అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో ఏరోస్పేస్‌ పరికరాల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు సర్ల ఏవియేషన్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated Date - Jun 29 , 2026 | 05:00 AM