ఆంధ్రలోకి బీఆర్ఎస్ వస్తే తొక్కిపడేస్తాం
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:05 AM
తెలంగాణ లో శెట్టిబలిజలను ఓసీల్లోకి చేర్చి గత సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, ఆయన నాయకత్వంలోని...
తెలంగాణ లో శెట్టిబలిజలకు కేసీఆర్ అన్యాయం: మంత్రి సుభాష్
అంబాజీపేట, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ లో శెట్టిబలిజలను ఓసీల్లోకి చేర్చి గత సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలోకి అడుగుపెడితే శెట్టిబలిజ సంఘీయులంతా తొక్కిపడేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు విమర్శలు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం సెంటర్లో ఏర్పాటు చేసిన శెట్టిబలిజ సంఘం స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో శెట్టిబలిజలను తిరిగి బీసీల్లో చేర్చాలని అక్కడ కమిషన్ను కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. పార్టీలు, పదవులు శాశ్వతం కాదని కుల ఐక్యతతో ముందుకు సాగాలని నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ శెట్టిబలిజలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్ మాట్లాడుతూ ఏపీలో శెట్టిబలిజలు రాజ్యాధికారాన్ని శాసించేలా అడుగులు వేయాలన్నారు. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు ఎం.ఎం.శెట్టి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు పాల్గొన్నారు.