అనంతబాబు కేసులో ఇద్దరి వాంగ్మూలాలు నమోదు
ABN , Publish Date - May 22 , 2026 | 06:20 AM
డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో రోజు గురువారం మృతుడి తండ్రి సత్యనారాయణ, తమ్ముడు నవీన్ వాంగ్మూలాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం నమోదు చేశారు.
సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్పై నేడు ఉత్తర్వులు
రాజమహేంద్రవరం, మే 21(ఆంధ్రజ్యోతి): డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో రోజు గురువారం మృతుడి తండ్రి సత్యనారాయణ, తమ్ముడు నవీన్ వాంగ్మూలాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం నమోదు చేశారు. రాజమహేంద్రవరం కోర్టులో చీఫ్ ఎగ్జామినేషన్ అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. శుక్రవారం సుబ్రహ్మణ్యం స్నేహితులు అరవ మణికంఠ, అరవ ప్రసాద్ల వాంగ్మూలాలు నమోదు చేసే అవకాశం ఉంది. సాక్షులను ప్రభావితం చేశారనే అభియోగంతో బెయిల్ రద్దు కావడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబును గురువారం పీటీ వారెంట్పై పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం నిర్ణయం వెలువడాల్సి ఉండగా న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. అదే కేసులో ఏ5గా ఉన్న న్యాయవాది ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థన దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు పేర్కొంది. కోర్టు బయట స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం శరీరంపై 31, అంతర్గతంగా 3 చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎంతో కక్ష ఉంటే గానీ అంత దారుణం చేయరని అన్నారు.