అనంతలో బడి బస్సు దగ్ధం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:42 AM
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో ప్రైవేటు పాఠశాల బస్సు అగ్నికి ఆహుతైంది.
విద్యార్థులు క్షేమం
పుట్లూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో ప్రైవేటు పాఠశాల బస్సు అగ్నికి ఆహుతైంది. పుట్లూరులోని శ్రీరామ గ్లోబల్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం విద్యార్థులను ఎక్కించుకొని కడవకల్లు వెళుతుండగా చింతకుంట వద్ద ఉన్నట్లుండి ఆగిపోయింది. డ్రైవర్ బస్సు దిగి పరిశీలించగా, బస్సు కింది భాగంలో మంటలు కనిపించాయి. దీంతో వెంటనే విద్యార్థులను కిందకు దించేశారు. ఆతర్వాత మంటలు పెరిగి బస్సు దగ్ధమైంది. బస్సులోని సుమారు 20 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వారిని మరో బస్సులో ఇళ్లకు తరలించారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని సమాచారం.