గంజాయి విక్రయాలపైౖ స్టింగ్ ఆపరేషన్
ABN , Publish Date - May 28 , 2026 | 05:33 AM
అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ముఠా కీలక వ్యక్తి సహా 14 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతలో 14 మంది అరెస్టు
7 కిలోల గంజాయి స్వాధీనం
అనంతపురం క్రైం, మే 27(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ముఠా కీలక వ్యక్తి సహా 14 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ జగదీష్ బుధవారం మీడియాకు వివరించారు. గంజాయి వినియోగాన్ని నిర్ధారించే మెడికల్ కిట్లను తెప్పించి, అనుమానితులకు పరీక్షలు చేశారు. కొందరికి పాజిటివ్ రావడంతో విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముఠాను పట్టుకునేందుకు స్టింగ్ ఆపరేషన్ చేశారు. కొందరు పోలీసు సిబ్బంది గంజాయి వినియోగదారుల తరహాలో ముఠా సభ్యులను సంప్రతించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేశారు. ముఠాలో కీలక వ్యక్తి పిషాకి సురేష్ సహా 14 మంది సభ్యులను గుర్తించి, పక్కా ఆధారాలతో వారిని అరెస్టు చేశారు. పట్టుబడినవారిలో పిషాకి సురేష్(36), షికారి మల్లన్న(43), షికారి భరత్(31), షికారి పరశురాం(55), షికారి రవి(36) పాత నేరస్థులు. షికారి సురేష్ గుంతకల్లు రైల్వే స్టేషన్ కేంద్రంగా గంజాయి నెట్వర్క్ నడుపుతున్నాడు. స్టేషన్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.10 వేలకు కిలో చొప్పున గంజాయిని సురేష్ కొనుగోలుచేస్తాడు. దాన్ని నలుగురు పాత నేరస్థుల సహకారంతో అనంతపురం నగరానికి చేరుస్తాడు.