అనంతబాబుకు చుక్కెదురు
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:49 AM
డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురయింది.
బెయిల్ తిరస్కరించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోర్టు
రాజమహేంద్రవరం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆయనకు బెయిలు తిరస్కరించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గతంలో అనంతబాబుకు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. అయితే కేసులోని సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ అనంతబాబుపై కాకినాడలో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ‘సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి చర్యల ద్వారా సుప్రీం కోర్టు విధించిన షరతులను అనంతబాబు ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి’ అని ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ అనంతరం కోర్టు బెయిల్ని రద్దు చేసింది. దీనిపై అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, తనకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అనంత బాబు దాఖలుచేసిన పిటిషన్లపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి.