అమరావతి.. అవకాశాల గని
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:04 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.
టాప్-10 జీవనయోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి.. తాజా ఆర్థిక సర్వే వెల్లడి
ఆర్థికపరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ
ఆరేళ్ల నుంచి రెవెన్యూ లోటే!
ద్రవ్యోల్బణం తగ్గుముఖం
రిజిస్ట్రేషన్, భూకేటాయింపులు, వేగంగా పర్యావరణ అనుమతులు
విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ భేష్
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ప్రధానంగా రాజధాని అమరావతి, రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు. అమరావతి నూతన గ్రీన్ఫీల్ ్డనగరంగా అవతరిస్తోందని.. ఏమీ లేని స్థాయి నుంచి ప్రజలు సౌకర్యంగా జీవించే పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం అరుదైన అవకాశాలను కల్పిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దేశంలో టాప్-10 జీవనయోగ్య నగరాల్లో విజయవాడ, తిరుపతి కూడా ఉన్నాయని వెల్లడించింది. ‘పట్టణీకరణ జరుగుతున్న ఇతర ప్రధాన నగరాల్లో మాదిరిగా అమరావతిలో జనసాంద్రత అత్యధికంగా లేదు. మౌలిక సదుపాయాలు, ఉపా ధి అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే భవిష్యత్ సమస్యలను నివారించవచ్చు. ట్రాఫిక్ గందరగోళం, అక్రమ కాలనీలు, సేవల్లో లోపాలు ఏర్పడక ముందే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం అవసరం’ అని సూచించింది. ఆర్థికపరంగా రాష్ట్రం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో.. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాల గురించి సర్వేలో వివరించారు. ‘2019 నుంచి 2025 వరకు వరుసగా ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతోనే కొనసాగుతోంది’ అని తెలిపింది.
2022-23లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 7.57 శాతం ఉంది. ఆ సమయంలో జాతీయ ద్రవ్యోల్బణ సగటు 6.66ు కాగా.. ఏపీలో ఎక్కువగా నమోదైంది. 2023-24లో జాతీ య సగటు 5.36 శాతం, ఏపీలో 5.54ు.. 2024-25లో జాతీయ సగటు 4.36ు, ఏపీలో 4.41 శాతంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు నడుమ జాతీయ ద్రవ్యోల్బణ సగటు 1.72 శాతంగా నమోదుకాగా ఏపీలో 1.39 శాతంగా ఉంది.
వ్యాపార సంస్కరణలు భేష్..
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచారు. పర్యావరణ అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడంలో భాగంగా ఏపీలో సింగిల్ విండో పారిశ్రామిక అనుమతులు, ఆన్లైన్ భూమి రిజిస్ట్రేషన్, ఈ-పర్యావరణ అనుమతులు లభిస్తున్నాయి. వ్యాపార సంస్థలు డిజిటల్ మార్గంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసేందుకు వీలు గా ఆన్లైన్ కన్సెంట్ మేనేజ్మెంట్ మానిటరింగ్ వ్యవస్థను విస్తరించారు. బిజినెస్ రిఫా ర్మ్ యాక్షన్ ప్లాన్ అమలుతో కొత్త వ్యాపార ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చా లా వేగంగా పర్యావరణ అనుమతులిస్తోంది.
దేశవ్యాప్తంగా ఒక హెక్టారుకు వరి దిగుబడిలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో దిగుబడి తక్కువగా ఉంది.
ఆహార ధాన్యాల సరఫరాను జీపీఎస్ ద్వారా సమర్థంగా పర్యవేక్షిస్తున్నారు.
ఏపీ, హిమాచల్, గుజరాత్లలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి. కేంద్ర బడ్జెట్లో వీటికి రూ.1,400 కోట్ల కేటాయింపు.
ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విద్యా విధానాల వల్ల విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరుగుతోంది.
మహిళల యాజమాన్యం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ల తర్వాత ఏపీకి స్థానం.
రాష్ట్రంలో భూ వినియోగ మార్పిడిలో విధానపరంగా జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
2025 నాటికి 6,901 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి.