అమరావతిలో ఫైవ్స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:16 AM
రాజధాని అమరావతిలో ఓం శ్రీ భవన సాయి అసోసియేట్ ఎల్ఎల్ పీ సంస్థ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ (హయత్ రీజెన్సీ హోటల్) ఏర్పాటుకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయ్యింది.
సీఆర్డీఏతో ఓం శ్రీ భవన సాయి అసోసియేట్ ఎల్ఎల్పీ సంస్థ ఒప్పందం
తుళ్లూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఓం శ్రీ భవన సాయి అసోసియేట్ ఎల్ఎల్ పీ సంస్థ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ (హయత్ రీజెన్సీ హోటల్) ఏర్పాటుకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయ్యింది. 200 గదులతో హోటల్, 10,500 మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ఆ సంస్థకు ఏపీ సీఆర్డీఏకి మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. వీటి నిర్మాణానికి ఏపీ సీఆర్డీఏ తుళ్లూరులో 6.05 ఎకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ మేరకు ఒప్పందపత్రాలను సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్) జుబిన్రాయ్, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్ ఎల్ఎల్పీ సంస్థ ప్రతినిధులకు గురువారం అందజేశారు. అమరావతిలో ఈ సంస్థ సుమారు రూ.1200 కోట్ల పెట్టుబడితో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు గతేడాది నవంబరులో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. గురువారం అగ్రిమెంట్ పూర్తి కావడంతో రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించి ఆతిఽథ్యం అందించే దిశగా కీలకమైన ముందడుగు పడింది.