చట్టబద్ధతతో రాజధానిపై ప్రజల్లో నమ్మకం: లావు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:52 AM
‘దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర రాజధానికీ పార్లమెంట్ ద్వారా ఇటువంటి చట్టబద్ధత కల్పించలేదు. ఇది ఏపీ విషయంలోనే మొదటిసారి జరుగుతున్న చరిత్రాత్మక ఘట్టం’ అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర రాజధానికీ పార్లమెంట్ ద్వారా ఇటువంటి చట్టబద్ధత కల్పించలేదు. ఇది ఏపీ విషయంలోనే మొదటిసారి జరుగుతున్న చరిత్రాత్మక ఘట్టం’ అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మరో ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు మాట్లాడుతూ, ‘రాజధానిగా అమరావతికి చట్టబద్ధతతో వైసీపీ, ఆ పార్టీ నేత జగన్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. చట్టబద్ధ గుర్తింపుతో అమరావతి అభివృద్ధిని ఆపడం ఎవరితరమూ కాదు’ అని స్పష్ట చేశారు. ఎంపీలు ఇద్దరూ మంగళవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఎంపీ లావు మాట్లాడుతూ, ‘విభజన సమయంలో ఏపీ రాజధానిని వదులుకోవడం వల్ల ఇప్పుడు అమరావతికి రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు కోసం పార్లమెంటులో సవరణ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడల్లా నిర్ణయాలు మారతాయనే చెడు ఉదాహరణ ప్రపంచానికి వెళ్లడం బాధాకరం. ఈ పరిస్థితిని మార్చడానికే చట్టబద్ధత. బుధవారం, గురువారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. దీంతో అటు రైతు లు, ఇటు ప్రజల్లో బలమైన నమ్మకం కలుగుతుంది’ అని స్పష్టం చేశారు. ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ, ‘పార్లమెంటులో అమరాతిని రాజధానిగా గుర్తించనున్న నేపథ్యంలో రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు ఇ చ్చిన రైతుల త్యాగానికి ప్రతిఫలం దక్కనుంది. అమరావతికి శంఖుస్థాపన చేసిన ప్రధాని మోదీ హయాంలోనే పార్లమెంటులో రాజధాని గుర్తింపు పొందడం రాష్ట్రాభివృద్ధి పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జగన్ ఇకనైనా అభిప్రాయాన్ని మార్చుకోవాలి.’ అని ఎంపీ కలిశెట్టి అన్నారు.