13న ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ జీఏడీకి అప్పగింత
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:57 AM
రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలను సీఎం చంద్రబాబు 13న జీఏడీకి అప్పగిస్తారని మంత్రులు నారాయణ, సత్యప్రసాద్, సవిత ప్రకటించారు.
క్వార్టర్స్ను పరిశీలించిన మంత్రులు నారాయణ, సత్యప్రసాద్, సవిత
తుళ్లూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలను సీఎం చంద్రబాబు 13న జీఏడీకి అప్పగిస్తారని మంత్రులు నారాయణ, సత్యప్రసాద్, సవిత ప్రకటించారు. మంగళవారం ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు నారాయణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో గొడ్డలి పార్టీ ఐదేళ్లలో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం రెండేళ్లల్లో పూర్తవడం సంతోషంగా ఉందని అన్నారు. అమరావతిలో ఇతర నిర్మాణాల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి నారాయణ దగ్గరుండి పనులు పరిగెత్తిస్తున్నారని అనగాని కొనియడారు. మంత్రులు, అధికారులు, అన్నీ వర్గాల ప్రజలు రాజధానిలో నివాసం ఉండేందుక వీలుగా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్తో వైసీపీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మంత్రులు దుయ్యబట్టారు.