అటు ఎస్బీఐ.. ఇటు బీవోబీ..!
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:50 AM
అమరావతి రాజధానిలోని ఫైనాన్స్ సిటీలో గతేడాది శంకుస్థాపన జరిగిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక్కొక్కటిగా నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి.
అమరావతి ఫైనాన్స్ సిటీలో బ్యాంకుల కార్యాలయాలు
నిర్మాణానికి మాస్టర్ ప్లాన్లు సిద్ధం... ఆకట్టుకుంటున్న డిజైన్లు
గుంటూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలోని ఫైనాన్స్ సిటీలో గతేడాది శంకుస్థాపన జరిగిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక్కొక్కటిగా నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఏపీ హెడ్క్వార్టర్స్ నిర్మాణానికి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిన నిర్మాణ సంస్థని ఎంపిక చేసేందుకు బిడ్లు కూడా నిర్వహించింది. అందులో భాగంగా విడుదల చేసిన కార్యాలయం డిజైన్ అబ్బురపరిచేలా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన కార్యాలయం గ్రాఫికల్ డిజైన్ని విడుదల చేసింది. ఈ క్రమంలో మిగిలిన బ్యాంకులు, సంస్థలు కూడా కొద్ది రోజుల్లోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అమరావతిలో ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీ్సను 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ స్థలం అమరావతి- విజయవాడ ఎక్స్ప్రెస్ వేతో పాటు మేజర్ సిటీ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానమై ఉంటుంది. ఇక్కడి నుంచి విజయవాడ 22 కి.మీ., గుంటూరు 35 కి.మీ., గన్నవరం ఎయిర్పోర్టు 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.60 కోట్ల అంచనా వ్యయంతో ఉద్ధండ్రాయునిపాలెంలో తన కార్యాలయాన్ని నిర్మించనుంది. ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయి. ఏజెన్సీలు ఖరారు కాగానే మట్టి పని, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.