రాజధాని రైతులకు కౌలు పెంపు
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:00 AM
రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదించిన పలు తీర్మానాలపై పురపాలక శాఖ ఆదివారం జీవోలు జారీ చేసింది. రైతుల వార్షిక కౌలు పెంపు, ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే గ్రాంట్లు పెంచడంతో..
ఎల్పీఎస్-2 రైతుల రుణమాఫీకి సీఆర్డీఏకు అనుమతి
ఇంటర్నెట్ విభాగం: రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదించిన పలు తీర్మానాలపై పురపాలక శాఖ ఆదివారం జీవోలు జారీ చేసింది. రైతుల వార్షిక కౌలు పెంపు, ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే గ్రాంట్లు పెంచడంతో పాటు రెండో విడత భూసమీకరణకు ముందుకొచ్చిన రైతులకు రుణమాఫీ చేసేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 12 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ (ఫాం 9.14) అమలు చేసిన రాజధానిలోని భూ యజమానులకు పదేళ్ల కాలానికి చెల్లించే వార్షిక కౌలును మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000 నుంచి రూ.40,000కు, జరీబు భూములకు ఎకరానికి రూ.60,000 పెంచారు. 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12నెలలకు చెల్లించే గ్రాంట్ను (అద్దె కల్పనతో సహా) నెలకు రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో రుణమాఫీ అమలు చేయడానికి, మార్గదర్శకాలు రూపొందించడానికి, బకాయి వ్యవసాయ రుణాల అర్హత నిర్ణయానికి ఏపీసీఆర్డీఏ చట్టం- 2014లోని సెక్షన్ 55(4) కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ తేదీ అయిన 2026 జూన్ 1ని కటాఫ్ తేదీగా స్వీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ పురపాలక శాఖ జీవో ఇచ్చింది.