Share News

ఈ విజయం అమరావతి రైతులకు అంకితం

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:49 AM

చట్టబద్ధతతో రాష్ట్ర రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరమని, దీనిపై ఇకపై ఎలాంటి అనుమానాలు, చర్చలకు తావు లేదని సీఎం చంద్రబాబు గురువారం ‘ఎక్స్‌’ పోస్టులో స్పష్టం చేశారు.

ఈ విజయం అమరావతి రైతులకు అంకితం

  • ‘ఎక్స్‌’లో ప్రధాని మోదీకి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): చట్టబద్ధతతో రాష్ట్ర రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరమని, దీనిపై ఇకపై ఎలాంటి అనుమానాలు, చర్చలకు తావు లేదని సీఎం చంద్రబాబు గురువారం ‘ఎక్స్‌’ పోస్టులో స్పష్టం చేశారు. ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌ అని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఉభయసభల్లో ’ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు, వారి సంకల్పానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు దేశ రాజధానిలో ప్రతిధ్వనించాయని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి ప్రస్థానంలో ప్రధాని మోదీ ప్రతి కీలక సందర్భంలోనూ అండగా నిలిచారని గుర్తుచేశారు. 2015 అక్టోబరు 22న అమరావతికి శంకుస్థాపన చేయడంతో పాటు 2025 మే2న పునర్నిర్మాణ పనులను కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. అమరావతికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, పార్లమెంట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేక అనేక సవాళ్లు, అనిశ్చితిని ఎదుర్కొందని, అలాంటి క్లిష్ట సమయంలో అమరావతి రైతులు చేసిన అమూల్యమైన త్యాగం, వారి పట్టుదల, నమ్మకం రాజధాని కలను సజీవంగా ఉంచాయని కొనియాడారు. ఈ చారిత్రక విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా పేర్కొంటూ పార్లమెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. దేశానికి అమరావతి ఒక అద్వితీయమైన భవిష్యత్‌ నగరంగా నిలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ద్వారా లభించే ఈ స్థిరత్వం ప్రతి ఆంధ్రుడిలో కొత్త విశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 03 , 2026 | 06:49 AM