రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:41 AM
రాష్ట్రమంతా జయహో అమరావతి అంటూ నినదించింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ సైతం బిల్లును ఆమోదించినట్టు తెలియగానే ప్రజలు ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చారు.
వాడవాడలా వెల్లివిరిసిన రాజధాని స్ఫూర్తి
జెండాలు చేబూని రోడ్ల మీదకు జనం
గ్రహణం వీడిందంటూ కొవ్వొత్తులతో మహిళల ప్రదర్శన
బైక్ ర్యాలీలతో హోరెత్తించిన యువత
మానవ హారాలతో రాజధానికి స్వాగతం
మోదీ, బాబు, పవన్ ఫొటోలకు క్షీరాభిషేకం
కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు
పెనుకొండలో నృత్యం చేసిన మంత్రి సవిత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రమంతా జయహో అమరావతి అంటూ నినదించింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ సైతం బిల్లును ఆమోదించినట్టు తెలియగానే ప్రజలు ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చారు. దీపాలు వెలిగించి, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ, మచిలీపట్నం సహా ప్రతి చిన్న గ్రామంలోను కేక్ కటింగ్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఏపీఎన్జీఓ నిర్వహించిన సంబరాల్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పాల్గొన్నారు. ఒంగోలులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొండపిలో మంత్రి స్వామి వేడుకల్లో పాల్గొన్నారు. కొన్నిచోట్ల ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లకు చిత్రపపటాలకు క్షీరాభిషేకాలు, నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన అమరావతి సంబరాలలో మంత్రి సవిత టీడీపీ నాయకులతో కలిసి నృత్యం చేశారు. శ్రీకాకుళం, పాతపట్నం, పలాసఓ పాటు పార్వతీపురంలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. అనంతపురం క్లాక్ టవర్ సర్కిల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ నాయకత్వంలో, రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండాలతో మానవహారం నిర్మించారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో విశాఖపట్టణం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు.
నార్త్ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు సీతమ్మధారలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఏలూరు నగరంలో ఎమ్మెల్యే బడేటి చంటి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు సొంగా రోషన్కుమార్, చింతమనేని ప్రభాకర్, పత్చమట్ల ధర్మరాజు తమ నియోజకవర్గాల్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, తన సతీమణి మనోరమతో కలసి వ్రతం నిర్వహించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. రాయచోటిలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్రె డ్డి, మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో ప్రదర్శనలు జరిగాయి. కాకినాడ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో మెయిన్రోడ్డులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ షిప్పింగ్ హార్బర్ వద్ద ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ బోటులతో ర్యాలీ జరిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో మంత్రి సుభాశ్ ఆఽధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఎమ్మెల్యే అంజిబాబు ప్రకాశం చౌక్ వద్ద సంబరాల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మంత్రి ఫరూక్, నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అమరావతి వేడుకల్లో పాల్గొన్నారు.
‘ఫ్యూచర్.. పీపుల్స్ అమరావతి’
ప్లకార్డులు ప్రదర్శించిన విద్యార్థినులు
అమరావతి చట్టబద్ధతని పొందటంపై అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలోని తులసీనగర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ‘అమరావతి-బిల్డింగ్ ది ఫ్యూచర్’, ‘పీపుల్స్ కేపిటల్...అమరావతి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. పిల్లలతో కలిసి టీచర్లు కూడా ఉత్సాహంగా ఈ సంబరంలో భాగం పంచుకున్నారు.
స్కూళ్ల నుంచి వర్సిటీల దాకా..
ప్రకాశం జిల్లా లింగసముద్రం, పొన్నలూరుతో పాటు పలుచోట్ల హైస్కూళ్లలో అమరావతికి మద్దతుగా విద్యార్థులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేక్ను కట్ చేశారు. కడప జిల్లా యోగివేమన వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో వీసీ మల్లయ్య, రిజిస్టార్ కిరణ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.