నిర్మాణ దశలోనే అమరావతి అందరినీ ఆకర్షిస్తోంది
ABN , Publish Date - May 18 , 2026 | 06:12 AM
రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్రస్థానంగా మారుతోందని మంత్రి లోకేశ్ అన్నారు.
సృష్టికర్తలు, పరిశోధకులకు కేంద్రస్థానం: లోకేశ్
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్రస్థానంగా మారుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతిలో సాగుతున్న క్వాంటమ్ యజ్ఞంలో ఎందరో భాగస్వాములవుతున్నారని, ముంబై నుంచి గోపాల్ జోషీ వచ్చారని, గుంటూరుకు చెందిన రిక్షా డ్రైవర్ కుమార్తె పల్లవి కయాల పదో తరగతిలో పదికి పది సాధించి ట్రిపుల్ఐటీలో ఇంజనీర్గా శిక్షణ పొంది క్వాంటమ్ ఆపరేషన్స్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రముఖ భారతీయ విద్యాసంస్థల్లో అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అభివృద్ధిపై రీసెర్చి చేసిన నాగలక్ష్మయ్య నేడు అమరావతి క్వాంటమ్ ఆపరేషన్స్లో భాగస్వాములయ్యారని వివరించారు. అమరావతిపై యువతలో పెరుగుతున్న నమ్మకం, ఆశలకు ఇది నిదర్శనమన్నారు.