అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చారిత్రకం
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:16 AM
అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దానికి పైగా చేస్తున్న పోరాటం చారిత్రకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు.
సీపీఐ ఈశ్వరయ్య
విజయవాడ (ధర్నాచౌక్), మార్చి 2 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దానికి పైగా చేస్తున్న పోరాటం చారిత్రకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్వంలో సోమవారం విజయవాడ ధర్నాచౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నో విజయాలు సాధించి తుది విజయానికి వారు సాగిస్తున్న పోరాటానికి సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బాధితులకు యుద్దప్రాతిపదికన న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగీకరించిన ప్రత్యేక కోర్టును అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ఏర్పాటు చేయాలని కోరారు. సంఘం ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ 4 వరకు రిలే నిరాహార దీక్షలు 5 నుంచి 7 వరకు నిరవధిక దీక్షలు చేపడతామన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.