గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానీదే!
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:10 AM
ప్రతిష్ఠాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థే చూసుకోనుంది. ఈ మేరకు ‘గూగుల్’ ఇది వరకే లేఖ రాసిన నేపథ్యంలో...
నిర్మాణం, నిర్వహణ ఆ సంస్థదే.. ప్రభుత్వానికి గూగుల్ లేఖ
అదానీ పేరిటే భూమి కేటాయింపు.. అదనంగా మరో 170 ఎకరాలు
క్యాబినెట్ సూత్రప్రాయ నిర్ణయం!
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థే చూసుకోనుంది. ఈ మేరకు ‘గూగుల్’ ఇది వరకే లేఖ రాసిన నేపథ్యంలో... భూముల యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణనూ అప్పగించాలన్న ప్రతిపాదనలపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అదానీ పెట్టిన మరికొన్ని షరతులపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం భావించింది. విశాఖలో గూగుల్ సంస్థ రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీని తమ భాగస్వామిగా పేర్కొంటూ గూగుల్ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. భవిష్యత్లో అదానీతోనే లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ తరుణంలోనే గూగుల్ డేటా సెంటర్కు ఇచ్చిన ప్రోత్సాహకాలన్నీ తమకు బదలాయించాలని కోరుతూ ప్రభుత్వానికి అదానీ లేఖ రాసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రివర్గం.. ఇప్పటికే విశాఖలో గూగుల్కు కేటాయించిన 480 ఎకరాలతోపాటు మరో 170 ఎకరాలు కేటాయించాలని తీర్మానించినట్లు తెలిసింది. అదానీ ప్రతిపాదించిన మిగిలిన అంశాలన్నింటిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.