రైతులను మోసగిస్తే చర్యలు
ABN , Publish Date - May 21 , 2026 | 11:59 PM
రైతులను మోసం చేసే ఎరువుల దుకాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ హెచ్చరించారు.
జేసీ నూరుల్ ఖమర్
ఎరువుల దుకాణాల తనిఖీ
ఎమ్మిగనూరు, మే21 (ఆంధ్రజ్యోతి): రైతులను మోసం చేసే ఎరువుల దుకాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని గురురాఘవేంద్ర ట్రేడర్స్, శ్రీ వెంకటరాజేశ్వరి ట్రేడర్స్తో పాటు పలు ఎరువుల దుకాణాలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సరైన ధరలకు అందుతున్నాయా లేదా అన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఎరువుల నిలువలు, విక్రయ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలు, లైసెన్సుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ యూ రియా అమ్మకాల్లో తేడా లు వస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఏడీఏ మహ్మద్ ఖాద్రీ, ఏఓ శివశంకర్, వ్యవస ాయ సిబ్బంది ఉన్నారు.
రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి: జేసీ
నందవరం: రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్ సూచించారు. నందవరం సమీపంలో కొనసాగుతున్న భూ రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ భూ సరిహద్దుల నిర్ధారణ, ఫీల్డ్ మ్యాపింగ్, రికార్డుల పరిశీలన వంటి అంశాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సర్వేలతో ఎదురవుతున్న సమస్యలను, సందేహాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభు త్వం చేపడుతున్న రీ సర్వే కార్యక్రమం రైతులకు భూ సంబంధిత వివాదాలు లేకుండ స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యమన్నారు. రైతుల అభ్యంతరాలు వెంటనే నమోదు చేసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను నిర్థేశిత గడువులోగా పూర్తి చేసి భూ రికార్డులను ఆధునికీకరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ వాహబ్, డీటీ మహేశ, డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, ఆర్ఐ, సర్వే అధికారులు పాల్గొన్నారు.