మంట పుట్టిస్తున్న అగ్గి పురుగు
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:02 AM
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో అగ్గి పురుగు(యాసిడ్ పురుగు) ప్రజలను వణికిస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫెడరస్ ఫస్ట్ పీస్. ఏడు నుంచి పది మిల్లీ మీటర్ల పొడవుండి..
శరీరంపై పాకినప్పుడు నలిపితే... విషం విడుదల
బొబ్బలు వచ్చి శరీరంపై పుండ్లు
తాడేపల్లిగూడెంలో జనం గగ్గోలు
తాడేపల్లిగూడెం రూరల్, మే జూన్ 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో అగ్గి పురుగు(యాసిడ్ పురుగు) ప్రజలను వణికిస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫెడరస్ ఫస్ట్ పీస్. ఏడు నుంచి పది మిల్లీ మీటర్ల పొడవుండి.. నలుపు, నారింజ రంగుల చారలతో వుండే ఈ పురుగులు ఇప్పుడు జనాలని కలవరపెడుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, కొండ్రుప్రోలు తదితర గ్రామాల్లో ఈ యాసిడ్ పురుగులు జనంపై దాడి చేస్తున్నాయి. ఇవి స్వయంగా కుట్టకపోయినప్పటికీ శరీరంపై వాలినప్పుడు నలిపితే... పురుగు శరీరంలోని టాక్సిక్ ద్రవం(విష రసాయనం) చర్మానికి అంటుకుని మంట, ఎర్రటి దద్దుర్లు, నీటి బొబ్బలు వస్తున్నాయి. ఆ తర్వాత చర్మం పొరలు ఊడి ఎర్రగా పుండ్లు పడుతున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగుల బాధితులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఎలర్జీ సోకితే ఆసుపత్రికి రండి
ఈ పురుగు చర్మంపై వాలితే ఎట్టి పరిస్థితిల్లోనూ దాన్ని నలపకూడదు. నలిపితే వెంటనే సబ్బుతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. నలిపిన చేతులతో కళ్లను తాకకూడదు. ఎలర్జీ నివారణకు ఆరోగ్య కేంద్రాల వద్ద లోషన్ ఇస్తారు. అవసరమైతే వైద్య శిబిరాలు నిర్వహించాలని ఇప్పటికే వైద్యులకు సూచనలు ఇచ్చాం.
- డాక్టర్ గీతాభాయి, డీఎంహెచ్వో, పశ్చిమగోదావరి