పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:12 PM
పదో తరగతి విద్యార్థులు రాబోయో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.
ప్రకృతి వ్యవసాయంతో ఆదాయం-ఆరోగ్యం
సచివాలయాల్లో సేవలు మెరుగుపరచాలి
బస్తిపాడు, చిన్నటేకూరు పర్యటనలో కలెక్టర్ డా. ఏ.సిరి
కల్లూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు రాబోయో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణులు కావచ్చని అన్నారు. బుధవారం కల్లూరు మండలం బస్తిపాడు, చిన్నటేకూరు గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. బస్తిపాడు గ్రామంలో శనగ, మొక్కజొన్న, బెండకాయ, మల్లెపూల తోట, ఆకుకూరల పంటలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. బస్తిపాడులో గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఏ. సిరి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వం రూపొందించిన వంద రోజుల ప్రణాళిక ప్రకారం పూర్తిస్థాయిలో నిత్యం పునశ్చరణ చేయాలన్నారు. ఈ కార్యకమ్రంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అసుదుల్లాఖాన, సర్వశిక్షా అభియాన పీడీ డాక్టర్ లోకరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అనంతరం బస్తిపాడు గ్రామంలో రైతుల పంటలను కలెక్టర్ పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తున్న రైతు ఈశ్వరయ్యను అభినందించారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ఆ తర్వాత బస్తిపాడులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలుగా నిలవాలని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకుని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుబ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ.రమణారెడ్డి, ఎంపిడీఓ జి.నాగశేషాచలరెడ్డి, ఏపిఎం. పుస్పావతి, తదితరులు పాల్గొన్నారు.