అక్రమ డిజిటల్ ఆస్తులు, షేర్లపై ఏసీబీ నిఘా!
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:34 AM
అవినీతి సొమ్మును డిజిటల్ ఆస్తులు, క్రిప్టోకరెన్సీ, షేర్ల రూపంలో దాచిపెడుతున్న అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించనుంది.
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అవినీతి సొమ్మును డిజిటల్ ఆస్తులు, క్రిప్టోకరెన్సీ, షేర్ల రూపంలో దాచిపెడుతున్న అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించనుంది. అలాంటి అక్రమాస్తులను గుర్తించేందుకు రాష్ట్రంలోని ఏసీబీ అధికారులకు ఐసీసీసీసీ (ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యాన విజయవాడలోని కేబీఎన్ కాలేజీలో ఈ నెల 18 నుంచి 20 వరకు వర్చువల్గా ఈ శిక్షణ కొనసాగినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. ఏసీబీకి చెందిన 32 మంది ఇన్స్పెక్టర్లు, ఏడుగురు డీఎస్పీలు, ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు ఎస్పీ/జాయింట్ డైరెక్టర్లు, నలుగురు లీగల్ అధికారులు, ఒక ఐజీ/డైరెక్టర్ స్థాయి అధికారికి ‘వర్చువల్ డిజిటల్ ఆస్తుల(వీడీఏ) దర్యాప్తు’ పై శిక్షణ ఇచ్చారు.