కలెక్టరేట్ ఉద్యోగికి రూ. 8 కోట్ల ఆస్తులు
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:14 AM
కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. సుమారు 700 గ్రా ముల బంగారు వస్తువులు, కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు.
ఏసీబీ దాడుల్లో వెలుగులోకి
కాకినాడ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. సుమారు 700 గ్రా ముల బంగారు వస్తువులు, కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వివరాలు... ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారనే సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రికార్డుల విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివరామ్కుమార్ ఇంటిపైన, అతడు పనిచేస్తున్న ఆఫీసు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు, వాహనాలను గుర్తించారు. వీటి విలువ సుమారు ఎనిమిది కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. పదేళ్లుగా శివరామ్కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్గా విధుల్లోకి చేరిన ఇతడు వివిధ సెక్షన్లలో పనిచేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇంకా బ్యాంక్ లాకర్లు, బినామీ ఆస్తులపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.