Share News

దర్శి మున్సిపల్‌ కమిషనర్‌పై ఏసీబీ దాడులు

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:10 AM

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్‌ కమిషనర్‌ వై.మహేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు.

దర్శి మున్సిపల్‌ కమిషనర్‌పై ఏసీబీ దాడులు

  • ఆదాయానికి మించి అక్రమాస్తుల గుర్తింపు

దర్శి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్‌ కమిషనర్‌ వై.మహేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. ఏకకాలంలో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిగాయి. ఏసీబీ డీఎస్పీ పి.రామకృష్ణుడు ఆధ్వర్యంలో కడప ఏసీబీ సీఐ పి.శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఏసీబీ ఎస్‌ఐ షరీ్‌ఫలు దర్శిలోని ఆయన నివాసానికి తెల్లవారుజామున 4 గంటలకే చేరుకున్నారు. అదే సమయంలో నరసరావుపేట, సత్తెనపల్లిలో కూడా మరికొంత మంది ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లలో తనిఖీలు ప్రారంభించారు. 11గంటల వరకు దర్శిలోని కమిషనర్‌ ఇంట్లో సోదాల అనంతరం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల వరకు తనిఖీలు జరిగాయి. డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ వై.మహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం వివరిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో తనిఖీలు పూర్తయిన తర్వాత మహేశ్వరరావును నెల్లూరు తీసుకెళ్లారు.

Updated Date - Feb 01 , 2026 | 05:11 AM