ACB Court: కల్తీ నెయ్యి కేసులో విజయభాస్కర్రెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:31 AM
కల్తీ నెయ్యి కేసులో నిందితుడు(ఏ34)గా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్రెడ్డి(62)కి కోర్టులో చుక్కెదురైంది.
ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
తిరుపతి/నెల్లూరు(లీగల్), జనవరి 9(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో నిందితుడు(ఏ34)గా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్రెడ్డి(62)కి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీల సామర్థ్యాన్ని, నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు దేవస్థానం నియమించుకున్న డెయిరీ టెక్నాలజీ నిపుణుల్లో విజయభాస్కర్ ఒకరు. సికింద్రాబాద్కు చెందిన ఆయన్ను టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుడిగా చేరుస్తూ గత నవంబరు 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. అప్పటినుంచీ ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు. పది రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 7న వాదనలు జరిగాయి. సిట్ తరఫున తిరుపతికి చెందిన ఏపీపీ జయశేఖర్ వాదనలు వినిపించారు. నెయ్యి సరఫరా చేసిన డెయిరీల ప్లాంట్లను తనిఖీ చేసేందుకు నెయ్యి నాణ్యత విషయంలో విజయభాస్కర్ తప్పుడు సమాచారం ఇచ్చి టీటీడీని, టెక్నికల్ కమిటీని, పాలకమండలిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆయా డెయిరీలకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చారని వివరించారు. ‘‘పలు డెయిరీల ప్లాంట్లను తనిఖీ చేయకుండానే చేసినట్టు, వాటికి తగిన సామర్థ్యం ఉందని అనుకూల రిపోర్టులు ఇవ్వడంతో అర్హత లేనప్పటికీ టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్నాయి. భోలేబాబా డెయిరీలో నెయ్యి కల్తీ దందా జరిగింది.
స్వల్ప పరిమాణంలో నెయ్యి తీసుకుని అందులో పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామోలిన్లను అధికంగా కలిపారు. వాటికి బీటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్ ఈస్టర్ తదితర రసాయనాలను జత చేసి కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ టెస్టు వాల్యూస్కు తగ్గట్టుగా నెయ్యి ప్లేవర్ సహా పలు ఇతర కల్తీ పదార్థాలు కలిపారు. ఈ నెయ్యిని భోలేబాబాతో పాటు వైష్ణవీ, మాల్గంగా, ఏఆర్ తదితర డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారు. ఈ కల్తీ నెయ్యినే టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించారు’’ అని ఏపీపీ వివరించారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డెయిరీ ఎండీ జగ్మోహన్ గుప్తా నుంచి విజయభాస్కర్రెడ్డి రూ.2.50లక్షలు లంచంగా తీసుకున్నారని, ఆల్ఫా డెయిరీ ప్రతినిధుల నుంచి 8 గ్రాముల గోల్డ్ కాయిన్, వైష్ణవి, భోలేబాబా, మాల్గంగా, ప్రీమియర్ ఫుడ్స్ తదితర డెయిరీల నుంచి హైదరాబాద్లోని హవాలా ఏజంట్ ద్వారా రూ.83 లక్షలు లంచంగా తీసుకున్నారని ఆరోపించారు. ఆయా డెయిరీలకు జరిపిన బిల్లుల చెల్లింపులతో టీటీడీకి సుమారు రూ.118 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. కాగా, సికింద్రాబాద్లోని నిందితుడి నివాసంలో సిట్ అధికారులు ఇటీవల తనిఖీలు చేసి రూ.34 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.