అమరావతిలో 76 కదంబం మొక్కలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:35 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడకు చెందిన కొడాలి నవీన్ చౌదరి వినూత్న ఆలోచన చేశారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచన
నేడు వేద, రుద్ర పారాయణతో మొక్కలు నాటే కార్యక్రమం
విజయవాడ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడకు చెందిన కొడాలి నవీన్ చౌదరి వినూత్న ఆలోచన చేశారు. కెనడాలో స్థిరపడి తిరిగి సొంత ప్రాంతానికి కొంతకాలం ఉండాలని వచ్చిన నవీన్.. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీని నిర్వహిస్తున్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండ్రాయునిపాలెంలో పవిత్ర నీరు-మట్టి క్షేత్ర ప్రాంగణంలో 76 కదంబం చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైల క్షేత్రంలో లభించే అసలైన పవిత్ర కదంబం చెట్లను ఆయన తీసుకొచ్చారు. పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన ఈ కదంబం చెట్లను పెంచిన చోట ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల నమ్మకం. ఏడీసీఎల్ నుంచి అనుమతులు పొందిన కొడాలి నవీన్ చౌదరి శంకుస్థాపన ప్రాంతంలో 76 గోతులు తవ్వించారు. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం 7.30 గంటలకు వేద, రుద్ర పారాయణతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని కొడాలి నవీన్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.