ఆవు పొట్టలో 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:50 AM
ఆవు పొట్టలోంచి 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన ఘటన విజయనగరంలో మంగళవారం చోటుచేసుకుంది.
శస్త్ర చికిత్స చేసి తొలగించిన పశు వైద్యులు
విజయనగరం రింగురోడ్డు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఆవు పొట్టలోంచి 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన ఘటన విజయనగరంలో మంగళవారం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తున్నాయనడానికి ఈఘటనే నిదర్శనం. పాడి రైతు దుక్క సురేశ్కు చెందిన ఆవు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సాధారణ సమస్యగా భావించి విజయనగరంలోని బహుళార్థ పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు. ఆవును పరీక్షించిన వైద్యులు కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయినట్టు గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి కడుపులో నుంచి సుమారు 70 కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. ఆవు ప్రస్తుతం కోలుకుంటున్నదని వైద్యులు తెలిపారు. పశువులకు ఆహారం, కూరగాయలు పెట్టేడప్పుడు ప్లాస్టిక్ కవర్లో ఉంచి పడేయవద్దని ప్రజలకు సూచించారు.